కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మహిళా కూలీలు మృతి

  • టిప్పర్ ఢీకొనడంతో నలుగురు మహిళా కూలీలు మృతి
  • కొవ్వూరు వంతెన సమీపంలో ఘటన
  • ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పనులకు వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న వారిని వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చీడగ గ్రామానికి చెందిన రోజువారీ కూలీలు ఉపాధి పనుల నిమిత్తం శనివారం ఉదయం బయలుదేరారు. కొవ్వూరు వంతెన వద్ద వారు రోడ్డు దాటుతుండగా, అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సత్యవతి, కృష్ణవేణి, చిట్టెమ్మ, అన్నవరం అనే నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరంతా చీడగ గ్రామానికి చెందినవారే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

Kakinada road accident
Kakinada
road accident
Andhra Pradesh
Kovvuru bridge
laborers
accident death
police investigation
Chidaga village

More Telugu News